శాయంపేట, జూలై 16: శాయంపేట మండలంలోని వసంతాపూర్, జోగంపల్లి, గట్లకాణిపర్తి గ్రామాల్లో ఎల్నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులు మరియు ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించే గ్రామసభలు నిర్వహించారు.ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి మార్క ప్రియదర్శిని మాట్లాడుతూ, ఈ వానాకాలంలో సాధారణం కంటే వర్షపాతం తక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నందున రైతులు వరి పంటపై మాత్రమే ఆధారపడకుండా పెసర, మినుము, అలసంద, జొన్న, సజ్జ వంటి తక్కువ వ్యవధిలో పండే, తక్కువ నీటి అవసరమున్న మెట్ట పంటలను సాగు చేయాలని సూచించారు.బోరు బావులు, బావులు ఉన్న రైతులు తమ వద్ద అందుబాటులో ఉన్న నీటి సామర్థ్యానికి అనుగుణంగానే సాగు విస్తీర్ణాన్ని నిర్ణయించుకోవాలని, మొత్తం భూమిలో వరి సాగు చేయకుండా అవసరమైన మేరకే సాగు చేపట్టాలని తెలిపారు. ప్రస్తుతం భూగర్భ జలాల మట్టాలు తగ్గుముఖం పట్టినందున నీటిని పొదుపుగా వినియోగించడం అత్యవసరమని పేర్కొన్నారు.
భవిష్యత్తులో నీటి లభ్యత మరింత తగ్గితే జలవిద్యుత్ ఉత్పత్తిపై ప్రభావం చూపి విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడే అవకాశం ఉందని, అందువల్ల అధిక నీటి అవసరమున్న వరి పంటకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయడం రైతులకు ఆర్థికంగా, వ్యవసాయపరంగా ప్రయోజనకరమని వివరించారు.
ఈ గ్రామసభల్లో వ్యవసాయ విస్తరణ అధికారులు అన్వేష్, అక్షర, సానియా, గ్రామ సర్పంచులు మారెబోయిన ప్రభాకర్, హింగే భాస్కర్, విజయ, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Post a Comment