వరంగల్: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ స్పష్టం చేశారు. బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్న వదంతుల కారణంగా ప్రజలు ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు.
వదంతులను నమ్మి పెద్ద సంఖ్యలో ప్రజలు పెట్రోల్ బంకులకు వెళ్లి వాహనాల్లో ఫుల్ ట్యాంక్ నింపించుకుంటుండడంతో అనవసర రద్దీ ఏర్పడుతున్నదని పేర్కొన్నారు. దీని వల్ల సరఫరా వ్యవస్థపై ఒత్తిడి పెరిగి తాత్కాలిక అంతరాయాలు కలుగుతున్నాయని చెప్పారు.
వరంగల్ కమిషనరేట్ పరిధిలోని అన్ని పెట్రోల్ బంకుల్లో సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని, సరఫరా నిరంతరంగా కొనసాగుతున్నదని సీపీ తెలిపారు. ఎటువంటి కొరత పరిస్థితి లేదని ఆయన స్పష్టం చేశారు.
ప్రజలు అవసరానికి మించి ఇంధనం నిల్వ చేసుకోవద్దని, అలా చేయడం వల్ల ఇతరులకు ఇబ్బందులు కలుగుతాయని సూచించారు. సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలను నమ్మకూడదని, నిర్ధారించని సమాచారాన్ని షేర్ చేయడం ద్వారా గందరగోళం సృష్టించవద్దని విజ్ఞప్తి చేశారు.
జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు అప్రమత్తంగా ఉన్నారని, వదంతులు వ్యాప్తి చేయడం లేదా ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే చర్యలకు పాల్పడితే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.
Post a Comment