వరంగల్ జిల్లా శాయంపేటలో రాజకీయ ఉద్రిక్తతలు నెలకొన్నాయి. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు పిలుపునిచ్చిన “చలో అసెంబ్లీ ముట్టడి” కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన లభిస్తున్న నేపథ్యంలో, స్థానికంగా కూడా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున సిద్ధమయ్యాయి.
ఈ క్రమంలో ఆదివారం రాత్రి పోలీసులు ముందస్తు చర్యగా బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు రాయరాకుల మొగిలిని ఆయన నివాసంలోనే అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ చర్యపై బీజేపీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అరెస్టుపై స్పందించిన మొగిలి మాట్లాడుతూ, ప్రజల సమస్యలపై పోరాడుతున్న నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు. లాఠీచార్జీలు, అక్రమ కేసులు, అరెస్టులతో ఉద్యమాన్ని అణచివేయాలని ప్రయత్నించినా బీజేపీ వెనక్కి తగ్గదని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించిన ఆయన, ఈ ద్రోహానికి వ్యతిరేకంగా బీజేపీ చేపట్టిన పోరాటం మరింత ఉధృతం అవుతుందని తెలిపారు.
ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎన్ని అరెస్టులు చేసినా ప్రజల హక్కుల కోసం పోరాటం ఆగదని, చివరి వరకు బీజేపీ శ్రేణులు ఉద్యమాన్ని కొనసాగిస్తాయని హెచ్చరించారు.
Post a Comment