రాష్ట్రానికి సరిపడేంత యూరియాను కేటాయించాలని కోరుతూ

 తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు.యూరియా కొరతను అధిగమించేందుకు తక్షణం చర్యలు చేపట్టాలని కేంద్ర కెమికల్ అండ్ ఫర్టిలైజర్స్ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డాకు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌కు మంత్రి లేఖలు రాశారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనందున రాష్ట్రంలో యూరియా అవసరం అంతకంతకు పెరిగిపోయిందని తెలిపారు. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి రాష్ట్రానికి 5 లక్షల మెట్రిక్ టన్నుల కోటాను కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిందని.. అందులో ఇప్పటి వరకు 3.06 లక్షల టన్నుల యూరియా రాష్ట్రానికి సరఫరా అయిందని చెప్పారు.అరకొర సరఫరా కారణంగా రాష్ట్రంలో దాదాపు 1.94 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కొరత ఏర్పడిందని* చెప్పుకొచ్చారు. తాజాగా జులై నెలకు నిర్దేశించిన *సప్లై ప్లాన్ ప్రకారం రాష్ట్రానికి 1.60 లక్షల మెట్రిక్ టన్నులు రావాల్సి ఉందన్నారు. కానీ అందులో 60 శాతం ఇంపోర్టెడ్ యూరియాను కేటాయించటం ఆందోళన కలిగిస్తోందని* లేఖలో పేర్కొన్నారు. దిగుమతుల ద్వారా రాష్ట్రానికి రావాల్సిన యూరియా సకాలంలో రాష్ట్రానికి చేరుకునే పరిస్థితి లేదని, ఇప్పటి వరకు ఆ యూరియాను రవాణా చేసేందుకు అవసరమైన నౌకల కేటాయింపు జరగలేదని లెటర్‌లో ప్రస్తావించారు. దీంతో ఖరీఫ్ పంటలకు అనువైన సమయంలో యూరియా కొరత రైతులను ఆందోళనకు గురి చేస్తోందని మంత్రి తుమ్మల కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. యూరియా సరఫరాపై కేంద్రం తక్షణమే చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. *జులై నెలకు కేటాయించిన 0.97 లక్షల మెట్రిక్ టన్నుల ఇంపోర్టెడ్ యూరియాకు నౌకలను కేటాయించాలని* కోరారు. ఆర్‌ఎఫ్‌సీఎల్ నుంచి తెలంగాణకు స్వదేశీ యూరియా సరఫరాను 30,800 టన్నుల నుంచి 60,000 టన్నులకు పెంచాలని వినతి చేశారు. ఏప్రిల్‌ నుంచి జూన్ వరకు తలెత్తిన యూరియా లోటును భర్తీ చేయడానికి అదనపు కోటాను కేటాయించాలని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు లేఖలో కోరారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post