లబ్దిదారులకు వ్యాపార నైపుణ్యాలపై అవగాహనకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలి
రాజీవ్ యువ వికాసం అమలు పై జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన డిప్యూటీ సీఎం
రాజీవ్ యువ వికాసం పథకం క్రింద నిరుద్యోగ యువత లాభసాటి వ్యాపార యూనిట్లు ఏర్పాటు చేసేలా పక్కాగా గ్రౌండింగ్ జరిగేలా పటిష్ట కార్యాచరణ అమలు చేయాలని డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. బుధవారం రాజీవ్ యువ వికాస పధకం అమలుపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామ కృష్ణా రావు హైదరాబాద్ సచివాలయం నుంచి అన్ని జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ కు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొన్నారు.రాజీవ్ యవ వికాసం పథకం అమలుకు సంబంధించి చేపట్టిన చర్యలను అధికారులు వివరించారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ గతంలో ప్రభుత్వాలు కార్పొరేషన్ ద్వారా మొక్కుబడిగా పథకాలు అమలు చేశాయని, తమ ప్రభుత్వం లక్షలాది మంది యువతకు స్వయం ఉపాధి కల్పించాలనే చిత్తశుద్ధితో రాజీవ్ యువ వికాస పథకం అమలు చేయనున్నదని అన్నారు.
యువ వికాసం పథకం క్రింద ఇచ్చే ఆర్ధిక సహాయంతో యువత వ్యాపారం చేసి లబ్ది పాందాలని సూచించారు. 8 వేల కోట్ల రూపాయలతో దాదాపు 5 లక్షల మంది యువతను వ్యాపార వేత్తలుగా మారుస్తున్నామని, ప్రభుత్వం పెట్టే ప్రతి పైసా పెట్టుబడి ఎలా పనిచేస్తుందో క్రమం తప్పక పర్యవేక్షణ చేయాలని అన్నారు. రాష్ట్ర జీడిపి వృద్ధిలో ఈ పథకం భాగస్వామ్యం కావాలని అన్నారు.ప్రభుత్వము మంజూరు చేసిన యూనిట్ల గ్రౌండింగ్ చేసిన తర్వాత వాటి పని తీరు పర్యవేక్షించేందుకు జిల్లాలో కమిటీలు ఏర్పాటు చేయాలని అన్నారు. మే 29, 30 తేదీలలో జరిగే ఇంచార్జి మంత్రుల సమావేశాలలో రాజీవ్ యువ వికాసం పై చర్చించి తుది జాబితా ఆమోదం తీసుకోవాలని అన్నారు. జూన్ 2 న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి, అందులో యువ వికాసం లబ్దిదారులకు ప్రొసీడింగ్స్ పంపిణీ చేయాలని డిప్యూటీ సీఎం సూచించారు.బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ,* రాజీవ్ యువ వికాసం పథకం నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని, లబ్దిదారులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రస్తుతం ఎంపిక చేసే లబ్దిదారులకు అవసరమైన శిక్షణ సంపూర్ణంగా అందించిన తర్వాత యూనిట్ గ్రౌండింగ్ పై దృష్టి పెట్టాలని అన్నారు. ప్రభుత్వం చేసే ఖర్చు పూర్తి స్థాయిలో సద్వినియోగం కావాలని , ఒకే రకమైన యూనిట్లు గ్రౌండ్ కాకుండా చూడాలని అన్నారు. వాహనాలు, ట్రాలీలు, కిరాణా షాపు వంటి యూనిట్లు తక్కువగా గ్రౌండ్ చేయాలని అన్నారు.
ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు మాట్లాడుతూ, 6250 కోట్ల సబ్సిడీ, 1667 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు మొత్తం దాదాపు 8 వేల కోట్ల రూపాయలతో 5 లక్షల మంది యువతకు రాజీవ్ యువ వికాస పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు. ప్రభుత్వ అందించే సహాయంతో యువత స్వయం ఉపాధి పొందాలని, రాజీవ్ యువ వికాసం ద్వారా ఆర్థిక ప్రగతి జరగాలని, యువతకు ఉపాధి అవకాశాలు జరగాలని అన్నారు.జిల్లా కలెక్టర్లు యూనిట్ గ్రౌండింగ్ చేయాలని సీఎస్ సూచించారు.
ఒకే రకమైన యూనిట్ల మంజూరు కాకుండా జాగ్రత్తలు వహించాలని, మనం మంజూరు చేసే యూనిట్ క్షేత్రస్థాయిలో వయబుల్ కావాలని అన్నారు. ఈ సమావేశంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్,స్థానిక సంస్థలు అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ఎస్సి కార్పొరేషన్ ఈడీ వెంకటేశ్వరరావు, బిసి సంక్షేమ అధికారి క్రాంతి కిరణ్, ఎస్సి అభివృద్ధి అధికారి సునీత, జిఎం సిద్దార్థ, సంక్షేమ అధికారి మల్లీశ్వరి తదితరులు పాల్గొన్నారు.
Post a Comment