కాకతీయ యూనివర్సిటీ క్రాస్ రోడ్డు నుండి పోలీస్ హెడ్ క్వార్టర్స్ వరకు నిర్వహించిన ర్యాలీలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అంటూ ఎంపీ డా. కడియం కావ్య నినదించారు.
వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ భారీ ర్యాలీలో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య పాల్గొన్నారు. మహాత్మా గాంధీ, అంబేద్కర్ ఫోటోలు, రాజ్యాంగం పుస్తకాన్ని చేతిలో పట్టుకుని ప్రజలకు రాజ్యాంగం విలువను తెలుపుతూ ఎంపీ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ.....
కేంద్ర బీజేపీ పాలనలో రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ, సమానత్వం హక్కులను కాలరాస్తు, మహాత్మా గాంధీ చూపిన అహింస, శాంతి సిద్ధాంతాలను విస్మరిస్తుందన్నారు. భారత రాజ్యాంగాన్ని దేశ సమగ్రతను కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా చేపట్టిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదముతో పెద్ద ఎత్తున ఉద్యమిద్దమని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య పిలుపునిచ్చారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం అంటే ప్రధాని మోదీకి ఏమాత్రం విలువ లేదని, అందుకే పార్లమెంట్ సాక్షిగా అంబేద్కర్ ను కించపర్చే విధంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడారని ఎంపీ మండిపడ్డారు. భారత రాజ్యాంగం అంటే బీజేపీ దృష్టిలో పుస్తకం మాత్రమేనని, కానీ తమ దృష్టిలో రాజ్యాంగం అంటే పవిత్ర గ్రంథం అని పేర్కొన్నారు. దేశంలో రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 ఏండ్లు పూర్తయిన సందర్భంగా రాజ్యాంగ విలువలపై ప్రజలకు అవగాహన కల్పించడం కోసమే 'జై బాపు, జై భీమ్, జై సంవిధాన్' కార్యక్రమాన్ని చేపట్టినట్లు వెల్లడించారు. పేదలంటే మోదీకి పట్టింపే లేదని, ఆయన ధ్యాసంతా దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేయడంపైనే ఉందని ఎంపీ డాక్టర్ కడియం కావ్య ధ్వజమెత్తారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Post a Comment