పార్టీ రజతోత్సవం వేళ కేసీఆర్ ఊహించని నిర్ణయం - ఆట మొదలు..

బీఆర్ఎస్ రజోత్సవం జరుపుకుంటోంది. తెలంగాణ ఉద్యమ పార్టీగా ప్రస్థానం మొదలై.. పదేళ్లు అధికారంలో ఉన్న గులాబీ ఇప్పుడు కొత్త కార్యాచరణతో సిద్దం అవుతోంది. అధికారం కోల్పోయిన తరువాత తొలి సారి మాజీ సీఎం కేసీఆర్ భారీ సభకు హాజరవుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పైన తన భవిష్యత్ ప్రణాళికలు వెల్లడించనున్నారు. పార్టీ సభ కోసం పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేసారు. రజతోత్సవ మహా సభ వేదికగా కేసీఆర్ కీలక ప్రకటనకు సిద్దం అవుతున్నారు. ఇక, కాంగ్రెస్ ప్రభుత్వం పైన సమరానికి ఈ సభ నుంచి శంఖారావం పూరించనున్నారు.
రజతోత్సవ సభ
బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సంబురాలకు సిద్దమైంది. ఎల్కతుర్తి వేదికగా భారీ సభకు సమాయత్తం అయింది. పాదయాత్రలు, ఎడ్లబండ్లు, ప్రభ బండ్లు, వాహనాల ర్యాలీలతో సభా ప్రాంగణానికి పయనమవడంతో ఓరుగల్లు రోడ్లు గులాబీ మయమయ్యాయి. 2005, 2010లో వరంగల్‌ కేంద్రంగా నిర్వహించిన భారీ బహిరంగ సభలకు దీటుగా ఈ రజతోత్సవ సభను నిర్వహించేలా.. లక్షలాదిగా జనసమీకరణ చేసేందుకు గులాబీదళం కార్యాచరణ అమలు చేసింది. ఇక అసెంబ్లీ ఎన్నికలు సహా వరుస ఓటములతో నైరాశ్యంలో ఉన్న గులాబీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపేలా సభను జయప్రదం చేయాలన్న సంకల్పంతో పార్టీ యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. మొత్తం 1,216 ఎకరాలను సిద్ధం చేయగా.. 169ఎకరాల్లో 2వేల మంది వలంటీర్లను ఏర్పాటు చేసింది. 1,059 ఎకరాలను పార్కింగ్‌ కోసం కేటాయించారు.
భారీ ఏర్పాట్లు
154ఎకరాల్లో సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. 500మంది కూర్చునే సామర్ధ్యంతో వేదికను నిర్మిస్తున్నా రు. వీఐపీల కోసం ప్రత్యేకంగా సభావేదిక వెనుక వైపు పార్కింగ్‌ స్థలాన్ని ఏర్పాటు చేశారు. అలాగే లక్షకు పైగా కుర్చీలను వేస్తున్నారు. భారీ సైజులో ఉన్న 23 ఎల్‌ఈడీ స్క్రీన్‌లను సభా ప్రాంగణంలో ఎక్కడ కూర్చున్న కనిపించేలా ఏర్పాటు చేస్తున్నారు. విద్యుత్‌ కోసం 200 జనరేటర్లను సమకూర్చు కున్నారు. 200మొబైల్‌ పెట్రోలింగ్‌ వాహనాలు, 200సీసీ కెమెరాలు, 200 వైర్‌లెస్‌ సెట్లతో నిరంతరం పర్యవేక్షించేలా గులాబీ నేతలు ఏర్పాట్లు చేశారు. దారి పొడువునా భారీ ఫ్లెక్సీలు, కటౌట్లు, వాల్‌రైటింగ్‌తో గులాబీమయం చేశారు. పార్టీ ఓటమి తరువాత ఈ సభ ద్వారా భవిష్యత్ కార్యాచరణ ప్రకటనకు సిద్దం అవుతున్నారు. కేసీఆర్ ఈ సభలో చేసే ప్రసంగం పైన రాజకీయంగా ఉత్కంఠ కొనసాగుతోంది.
కేసీఆర్ కీలక ప్రకటన
2023 ఎన్నికల్లో ఓటమి తరువాత కేసీఆర్ రాజకీయంగా అంత యాక్టివ్ గా లేరు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో ప్రచారం మినహా.. బయటకు రాలేదు. కొన్ని సందర్భాల్లో పార్టీ సమావేశాల్లో పాల్గొన్నారు. రెండు సందర్భాల్లో అసెంబ్లీకి హాజరయ్యారు. ఇప్పుడు కేసీఆర్ ఈ సభ ద్వారా తమ రాజకీయ కార్యాచరణ ఫిక్స్ చేయనున్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనుండటంతో ఈ సభ నుంచే పార్టీకి దిశా నిర్దేశం చేసే అవకాశం కనిపిస్తోంది. తన పాలనలో నిర్ణయాల పైన చేస్తున్న విమర్శలు.. అవినీతి ఆరోపణలకు సమాధానం చెప్పాలని కేసీఆర్ డిసైడ్ అయ్యారు. అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పైన పోరుబాటకు కేసీఆర్ సిద్దం అవుతున్నట్లు పార్టీ నేతల సమాచారం. దీంతో.. సీఎం రేవంత్ లక్ష్యంగా కేసీఆర్ రజతోత్సవ సభ నుంచి చేసే ప్రకటన పైన ఇప్పుడు రాజకీయంగా ఆసక్తి నెలకొంది.


0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post