వీడియో కాన్ఫరెన్స్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు రాజీవ్ యువ వికాసం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది, అధికారులు అప్రమత్తంగా ఉండి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఆదేశించారు. సోమవారం సాయంత్రం ప్రజా భవన్ నుంచి ఆయన చీఫ్ సెక్రటరీ, సెక్రటరీలు, జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించి అధికారులకు సూచనలు చేశారు. నిరుద్యోగ యువత వారి కాళ్లపై వారు నిలబడాలన్న మహోన్నత ఆశయంతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకానికి పదివేల కోట్లు ఖర్చు చేస్తుందని, అధికారులు అంతా మనసుపెట్టి పనిచేయాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. దశాబ్ద కాలంగా నిరుద్యోగ యువతపై ఇంత పెద్ద మొత్తంలో ఎప్పుడూ నిధులు ఖర్చు చేయలేదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది అని వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తాను ఈ పథకం ప్రగతిపై నిరంతరం సమీక్షిస్తామని అన్నారు. వరుస సెలవుల నేపథ్యంలో ఏప్రిల్ 14 వరకు దరఖాస్తు గడువు పెంచాలని అధికారులను ఆదేశించారు. జూన్ 2న అర్హులకు శాంక్షన్ లెటర్లు ఇవ్వాలని అన్నారు. జూన్ 2 నుంచి 9 వరకు ప్రతి రోజు ఒక మండలం చొప్పున నియోజకవర్గం అంతటా శాంక్షన్ లెటర్లు అందజేయాలని తెలిపారు. జూన్ 9 తర్వాత శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించాలని, 50 వేల వరకు లబ్ధి పొందిన వారికి వారం రోజులపాటు, 50 వేల నుంచి రెండు లక్షల వరకు లబ్ధి పొందిన వారికి 15 రోజులపాటు, 2 లక్షల నుంచి నాలుగు లక్షల వరకు ప్రయోజనం పొందిన వారికి నెలరోజుల పాటు శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. శిక్షణ పూర్తి చేసుకొని వచ్చిన వారికి వెంటనే గ్రౌండింగ్ చేసి నగదు అందజేయాలని కోరారు. జూలై మొదటి వారం కల్లా గ్రౌండ్ ఈ కార్యక్రమం పూర్తి చేయాలని ఆదేశించారు. దరఖాస్తుల స్వీకరణ మొదలు గ్రౌండ్ వరకు నిరుద్యోగ యువత ఇబ్బందులు ఎదుర్కోకుండా ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించేందుకు ప్రతి జిల్లాలో ఒక యువ అధికారిని నియమించాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ కు ఐడిఓసి కార్యాలయం నుండి అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, డిఆర్డీఓ నరేష్, ఎస్సి కార్పోరేషన్ ఈ డి వెంకటేశ్వర్లు, పరిశ్రమల శాఖ జిఎం సిద్ధార్థ, ఎస్సి సంక్షేమ అధికారి సునీత, ఎస్టీ నోడల్ అధికారి జీవరత్నం తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ మాట్లాడుతూ, రాజీవ్
యువ వికాసం పథకానికి ఎక్కువమంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకునే విధంగా మండల, మున్సిపల్ స్థాయిలో విస్తృతంగా టామ్ టామ్ ద్వారా ప్రచారం నిర్వహిస్తామని తెలిపారు. పధక సమాచారాన్ని మండల, మున్సిపల్ కార్యాలయంలో ఫ్లెక్సీలు ఏర్పాటు ద్వారా ప్రదర్శిస్తామని తెలిపారు. గ్రామీణ స్థాయిలో రాజీవ్ యువికాసం పథకానికి ఎక్కువమంది దరఖాస్తులు చేసుకునే విధంగా యువతను ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లాలో రాజీవ్ యువ వికాసం పథకానికి వచ్చిన ప్రతి దరఖాస్తుల వివరాలను పకడ్బందీగా నమోదు చేస్తామని, నోడల్ అధికారిగా డిఆర్డీఓ ను నియమించామని తెలిపారు.
Post a Comment