ప్రధానికి చిత్తశుద్ధి ఉంటే జనగణనలో కులగణన కూడా చేయాలి : సీఎం రేవంత్ రెడ్డి

రాష్ట్రంలో బీసీ కులగణన సర్వే చేపట్టడం ద్వారా చారిత్రాత్మక నిర్ణయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుందని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. కులగణన విషయంలో భవిష్యత్ లో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రధాని మోదీకి చిత్తశుద్ధి ఉంటే జనగణనలో కులగణన కూడా చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. మోదీకి కులగణన ఇష్టం లేదు కాబట్టే రాష్ట్రంలో కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ వద్దని అంటున్నారనిసీఎం ధ్వజమెత్తారు. బీసీ కులగణనపై ప్రతిపక్షాల నుంచి పలు సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ మేరకు ప్రజాభవన్ లో బీసీ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు.పకడ్బందీగా నిర్వహించిన రాష్ట్రం మరోకటి ఉండదు : రాహుల్‌గాంధీ ఆశయం మేరకు తమ ప్రభుత్వం సమగ్రమైన కులగణన చేపట్టిందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా కులగణన చేయాల్సిన అవశ్యకత ఏర్పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. రాహుల్‌గాంధీ ప్రధాని అయితే అన్ని రాష్ట్రాల్లో కులగణన జరిగితీరుతుందని సీఎం జోస్యం చెప్పారు. కులగణనను కాపాడుకోకపోతే బీసీలే నష్టపోతారని రేవంత్ రెడ్డి వివరించారు. కులగణనను ఇంత పకడ్బందీగా నిర్వహించిన రాష్ట్రం మరొకటి ఉండదని వివరించారు.రెండో విడత పూర్తికాగానే నివేదికకు చట్టబద్ధత : కులగణన నివేదిక ఆధారంగా బీసీల కోసం చేపట్టాల్సిన సామాజిక, ఆర్థిక, రాజకీయ కార్యాచరణపై సూచనలు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. బీసీల జనాభా ప్రకారం వారికి అవకాశాలు కల్పించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. రెండో విడత పూర్తికాగానే నివేదికకు చట్టబద్ధత కల్పిస్తామని రేవంత్ రెడ్డి వివరించారు. భవిష్యత్‌లో ఎవరూ కోర్టుకు వెళ్లకుండా చూసేందుకే రెండో అవకాశం ఇచ్చామన్నారు. కులగణన సర్వేలో ఎక్కడ తప్పులు జరిగాయో నిరూపించాలని రేవంత్ సవాల్ విసిరారు. అసెంబ్లీలో పెట్టి చట్టబద్ధత కల్పించడంతో తన బాధ్యత నెరవేరుతుందని సీఎం వివరించారు. జనాభా దామాషా ప్రకారం ఏం కోరుకుంటున్నారో బీసీలే చెప్పాలని కోరారు.అందుకే బీజేపీ, బీఆర్ఎస్ లు భయపడుతున్నాయి : కేసీఆర్‌ హయాంలో చేసిన సమగ్ర కుటుంబ సర్వేలో 4 కేటగిరీలుగానే జనాభా శాతాన్ని చెప్పారన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వేలో 5 కేటగిరీలు ఉన్నాయని వివరించారు. ముస్లింలలో ఓబీసీలను నాడు కేసీఆర్‌ ప్రభుత్వం విడిగా చెప్పలేదని దుయ్యబట్టారు. బీసీల లెక్క తేలితే మాకేంటి అని ఆ వర్గం అడుగుతారని బీజేపీ, బీఆర్‌ఎస్‌ భయపడుతోందని తెలిపారు. చారిత్రాత్మకమైన, సాహసోపేతమైన నిర్ణయాన్ని కాంగ్రెస్‌ తెలంగాణ ప్రభుత్వం తీసుకుందని రేవంత్ పేర్కొన్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post