హెల్మెట్ ధరించడం వల్ల రోడ్డు ప్రమాదాలలో ప్రాణాలు పోకుండా బయట పడొచ్చని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా రవాణా మరియు పోలీసుశాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన హెల్మెట్ అవగాహన మోటారు సైకిల్ ర్యాలీలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరేలు పాల్గొన్నారు. 

ఐడిఓసి కార్యాలయం నుండి గణేష్ చౌక్ మీదుగా డా బిఆర్ అంబేద్కర్ సెంటర్ వరకు కొనసాగిన ర్యాలినీ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ జెండా ఊపి ప్రారంభించగా జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలు హెల్మెట్ ధరించి వాహనాలు నడిపి పలువురిని ఆకర్షించారు.

అనంతరం డా బిఆర్ అంబేద్కర్ సెంటర్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ పలువురు డ్రైవర్లకు ఉచిత కళ్లద్దాలు పంపిణీ 
చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వాహనదారులు హెల్మెట్ ధరించడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాలను కాపాడుకోవడానికి అవకాశం ఉందని తెలిపారు. దేశంలో సగటున 70 శాతం రోడ్డు ప్రమాదాలలో ద్విచక్ర వాహన దారులు హెల్మెట్ ధరించకపడోవడం వల్ల ప్రాణాలు కోల్పోతున్నారని, ఇది చాలా బాధాకరమని తెలిపారు. ప్రతి ద్విచక్ర వాహన దారులు విధిగా హెల్మెట్ ధరించాలని, ఇతర వాహనాలు నడిపే డ్రైవర్లు సీట్ బెల్ట్ ధరించి వాహనం నడపాలని సూచించారు. రోడ్డు పై ప్రయాణం చేసే సమయంలో ప్రతి ఒక్కరూ ఒక్క సారి తమ కుటుంబ సభ్యులను గుర్తుచేసుకుని వాహనం నడపాలని, 
తమతో పాటు ఇతరులకు ఇబ్బందులు కలగకుండా రోడ్డు భద్రతా నియమాలను, ప్రమాణాలను పాటిస్తూ వాహనాలు నడిపి సురక్షితంగా గమ్యం చేరాలని కలెక్టర్ సూచించారు.

జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే మాట్లాడుతూ
జిల్లాలో వాహనదారులకు రోడ్డు భద్రత, హెల్మెట్ ధరించడంపై అవగాహన కల్పించడానికి హెల్మెట్ ర్యాలీ నిర్వహించడం జరిగిందని తెలిపారు. జిల్లాలో ఎక్కువగా బొగ్గు, ఇసుక లారీలు రవాణా ఎక్కువగా జరుగుతుందని రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు పెద్ద సంఖ్యలో ద్విచక్ర ప్రమాదాల బారినపడి గాయపడి మరణిస్తున్నారని తెలిపారు. హెల్మెట్ ధరించడం వల్ల ప్రాణాలను కాపాడుకోవచ్చు అని తెలిపారు.
ప్రతి రోజు పోలిస్ శాఖ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని, మద్యం సేవించి వాహనం నడుపుతున్న కొంత మందిని జైలుకు పంపిన సంఘటనలు ఉన్నాయన్నారు. వాహన దారులు రోడ్డు పై ప్రయాణించేటప్పుడు ఇతరులకు ఇబ్బందులు కలగకుండా ప్రయాణించాలని తెలిపారు. యువత ఎక్కువగా బైక్ లపై రాష్ డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాల బారిన పడుతూ తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగులుస్తున్నారని అన్నారు. యువత తల్లిదండ్రులు తమపై పెట్టుకున్న ఆశలను, ఆశయాలను గుర్తు పెట్టుకుని, వేగ నియంత్రణ పాటించాలని ఎస్పీ సూచించారు. అంబేద్కర్ సర్కిల్ లో కళాకారులు హెల్మెట్ దరించాలని అట, పాటలతో అవగాహన కల్పించారు. 
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, రవాణా శాఖ అధికారి మహమ్మద్ సంధాని, అదనపు ఎస్పీ బోనాల కిషన్, డిఎస్పీ సంపత్ రావు, సిఐలు నరేష్ కుమార్, మల్లేష్, ఎస్ఐలు, సింగరేణి , జెన్కో అధికారులు, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది, బార్ అసోసియేషన్ సభ్యులు, పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post