హనుమకొండ జిల్లా: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తోందని బహుజన సంక్షేమ సంఘం హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షులు మారపేల్లి విజయ్ కుమార్ విమర్శించారు. ప్రజా సంక్షేమం కోసం ఇచ్చిన హామీలను నమ్మబలికి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం, గెలిచిన తర్వాత వాటిని విస్మరించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీలలో ఫ్రీ బస్ పథకం తప్ప మిగతా హామీలు సక్రమంగా అమలు కావడంలేదని అన్నారు. రాజీవ్ యువ వికాసం, చేయూత, రైతు భరోసా, ప్రతి పేద మహిళకు రూ.2500 ఆర్థిక సహాయం, భూమిలేని మహిళలకు సంవత్సరానికి రూ.12,000, నిరుద్యోగ భృతి వంటి కీలక పథకాలు ఇంకా అమలులోకి రాలేదని విమర్శించారు.
ప్రభుత్వం ఏర్పడి దాదాపు మూడు సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ ప్రజా సమస్యలను పట్టించుకోకపోవడం సిగ్గుచేటని అన్నారు. నిరుద్యోగ యువతకు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని హామీ ఇచ్చినా, ఇప్పటివరకు విడుదల చేయకపోవడం ద్వారా యువతను మోసం చేశారని ఆరోపించారు.
గ్రామాల్లో అభివృద్ధి లేక ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఇచ్చిన హామీలను అమలు చేసి ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బహుజన సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు మారపేల్లి సుధాకర్ డాన్, ఎ. రాజు, మల్లేష్, మొగిలి తదితరులు పాల్గొన్నారు.
Post a Comment