రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి

ప్రజలు కోరుకుంటేనే అన్ని పదవులు..
- రూ.16,70,000 విలువ కలిగిన చెక్కులను లబ్దిదారులకు అందజేసిన ఎమ్మెల్యే..
- అంబేద్కర్ సెంటర్ వరకు జై బాపూ, జై భీమ్, జై సంవీధాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర..
- పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు.. 
శాయంపేట, 20 మే 2025 :
త్వరలో జరగనున్న స్థానిక జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకోవాలని, ప్రజల్లో మంచితనం ఉన్నవారికే అవకాశాలు ఉంటాయని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావుఅన్నారు. ఈరోజు సాయంత్రం శాయంపేట మండల కేంద్రంలోని ఎస్వీకేకే వేడుకల మందిరంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి అధ్యక్షతన మండలంలోని అన్ని గ్రామాల ముఖ్య నేతలతో సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. క్షేత్ర స్థాయి నుండి పార్టీ నిర్మాణంలో సామాజిక న్యాయం పాటించడం ద్వారా ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుద్దామని కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్‌ అన్నారని గుర్తుచేశారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ ప్రక్షాళనలో పీసీసీ పరిశీలకుల బాధ్యత అత్యంత కీలకమైందన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని ఎమ్మెల్యే సూచించారు. త్వరలో జరగనున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకోవాలన్నారు.
సీఎం సహాయ నిధి అండగా నిలుస్తోంది
పేద, నిరుపేద ప్రజలకు సీఎం సహాయ నిధి ఎంతో అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే జీఎస్సార్ అన్నారు. ఈరోజు శాయంపేట లో సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశం అనంతరం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన మొత్తం 37 మందికి సీఎంఆర్ఎఫ్ లబ్దిదారులకు రూ.16,70,000 విలువ కలిగిన చెక్కులను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం సహాయనిధి ద్వారా పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతుందన్నారు. ఆపదలో సీఎం సహాయనిధి ఆపద్బాంధులా ఆదుకుంటుందని తెలిపారు. మానవతా దృక్పథంతో సీఎం రేవంత్ రెడ్డి దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి ఆర్థిక సహాయాన్ని మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. పేద ప్రజలను ఆదుకునేందుకు ప్రజా ప్రభుత్వ అనేక సంక్షేమ పథకాలను అమలు చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే గుర్తు చేశారు.
అంబేద్కర్ సెంటర్ వరకు జై బాపూ, జై భీమ్, జై సంవీధాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర
శాయంపేటలో సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశం అనంతరం ఫంక్షన్ హాల్ నుండి స్థానిక అంబేద్కర్ సెంటర్ వరకు మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన జై భీమ్, జై బాపూ, జై సంవీధాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రలో వందలాది మంది కాంగ్రెస్ నేతలతో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మన దేశ రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాజ్యాంగ విలువలపై ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. నేడు పేద, బలహీన వర్గాల ప్రజల ఆకాంక్షలు నెరవేరటం లేదని, ప్రధానికి పేద ప్రజల కంటే బడాబాబులు ముఖ్యమన్నారు. రాజ్యాంగం కేవలం ఒక పుస్తకం కాదని, అంబేడ్కర్, గాంధీ, పూలే లాంటి గొప్ప వాళ్ళ ఆలోచనలతో కూడిన ఒక పవిత్ర గ్రంథమన్నారు. గ్రామ, మండల స్థాయిలో ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమాలల్లో అన్ని గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, పలువురు ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు ఉన్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post