అంతరిక్ష పరిశోధనల్లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ముందడుగు వేసింది

శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్ నుంచి చేపట్టిన పీఎస్‌ఎల్వీ-సీ60 ప్రయోగం సక్సెస్ అయింది. నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లిన వాహకనౌక టార్గెట్‌, ఛేజర్‌ ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. సరిగ్గా రాత్రి 10 గంటల 15 సెకెన్లకు మొదటి ప్రయోగవేదిక నుంచి పీఎస్‌ఎల్వీ-సీ60 రాకెట్ 2 ఉపగ్రహాలతో దూసుకెళ్లింది. స్పేస్‌ డాకింగ్‌ ఎక్స్‌పెరిమెంట్‌ (స్పేడెక్స్‌) పేరిట జంట ఉపగ్రహాలను భూ కక్ష్యలో అనుసంధానం చేసే బృహత్తర ప్రయోగాన్ని ఇస్రో చేపట్టింది. అంతరిక్షంలోనే వ్యోమనౌకలను డాకింగ్‌, అన్‌ డాకింగ్‌ చేసే అత్యంత సంక్లిష్టమైన టెక్నాలజీ అభివృద్ధే లక్ష్యంగా ఈ మిషన్ చేపట్టారు. పీఎస్‌ఎల్వీ ద్వారా ప్రయోగించిన రెండు చిన్న వ్యోమనౌకలను అంతరిక్షంలోనే ఒకదానితో ఒకటి డాకింక్‌ చేయించడం ఈ మిషన్‌ ప్రధాన లక్ష్యం. ఆ టార్గెట్‌, ఛేజర్‌ ఉపగ్రహాల బరువు 440 కిలోలు ఉంటుందని ఇస్రో తెలిపింది.విజయవంతమైతే నాలుగో దేశంగా భారత్‌ :* డాకింగ్‌ ప్రక్రియకు మరో వారం పడుతుందని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్‌ తెలిపారు. అంతరిక్షంలోనే ఉపగ్రహాలను డాకింగ్‌, అన్‌డాకింగ్‌ చేసేలా చేపట్టిన ఈ ప్రయోగం భూ ఉపరితలం నుంచి 470 కి.మీ. ఎత్తులో జరగనుంది. జనవరి 4న రెండు ఉపగ్రహాలను దగ్గరకు తీసుకువచ్చే ప్రక్రియ ప్రారంభమవుతుంది. పరస్పరం ఢీకొనకుండా రెండు శాటిలైట్ల మధ్య కమ్యూనికేషన్‌ అనుసంధానం జరుగుతుంది. ఆ తరువాత 2 ఉపగ్రహాలను డాకింగ్‌, అన్ డాకింగ్ చేస్తారు. అనంతరం సాధారణ ఉపగ్రహాల్లా వేర్వేరుగా అంతరిక్ష పరిశీలన చేస్తారు. డాకింగ్‌, అన్ డాకింగ్ ప్రక్రియ విజయవంతమైతే అమెరికా, రష్యా, చైనా తరువాత ఈ టెక్నాలజీ సాధించిన నాలుగోదేశంగా భారత్ అవతరించనుంది.

భవిష్యత్ ప్రయోగాలకు కీలకం :చంద్రుడిపై వ్యోమగామిని దించడం, జాబిల్లి నుంచి మట్టిని తీసుకురావడం, 2035 నాటికి సొంత అంతరిక్ష కేంద్రం నిర్మించాలన్న భారత్‌ కల సాకారం కావాలంటే వ్యోమ నౌకల డాకింగ్‌, అన్‌ డాకింగ్‌ సాంకేతికత ఎంతో అవసరం. అందుకే ఈ ప్రయోగం ఇస్రోకు ఎంతో కీలకంగా మారింది.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post