తెలంగాణ రాష్ట్ర అవసరాలకు కేటాయించిన యూరియాను సకాలంలో సరఫరా చేయాలని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి శ్రీ జేపీ నడ్డా గారికి ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి గారు కేంద్ర మంత్రిని ఆయన నివాసంలో కలిశారు.
వానా కాలం సీజన్కు సంబంధించి ఏప్రిల్ - జూన్ మధ్య రాష్ట్రానికి 5 లక్షల మెట్రిక్ టన్నులకు గానూ కేవలం 3.07 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా చేశారని కేంద్ర మంత్రి దృష్టికి తెచ్చారు.
రాష్ట్రంలో ప్రాజెక్టులకు నీరు రావడం, వ్యవసాయ పనులు జోరుగా సాగుతున్న సమయంలో యూరియా సరఫరా కాకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని కేంద్ర మంత్రికి వివరించారు.జులై నెలకు సంబంధించి దేశీయంగా ఉత్పత్తయిన యూరియా 63 వేల మెట్రిక్ టన్నులు, విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న యూరియా 97 వేల మెట్రిక్ టన్నులు రాష్ట్రానికి సరఫరా చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు కేవలం 29 వేల మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే చేశారని వివరిస్తూ వెంటనే విడుదల చేయాలని కోరారు.అలాగే, తెలంగాణకు దేశీయంగా ఉత్పత్తి అవుతున్న యూరియా కోటాను పెంచాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. యూరియా సరఫరాకు సంబంధించి రైల్వే శాఖ తగిన రేక్లు కేటాయించడం లేదని, వాటి సంఖ్య కూడా పెంచాలని కోరారు.కేంద్ర మంత్రి జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి తో పాటు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి , ఎంపీలు డాక్టర్ మల్లు రవి , చామల కిరణ్ కుమార్ రెడ్డి తో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Post a Comment