గీసుగొండ : వరంగల్ జిల్లాలో అంగరంగ వైభవంగా నిర్వహించే కొమ్మాల శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలయ జాతర నేటి నుంచి ప్రారంభమైంది. హోళీ పండుగ సందర్భంగా మొదలయ్యే ఈ జాతరలో ప్రభ బండ్ల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. తెలంగాణలో ప్రభలను ఈ స్థాయిలో ప్రదర్శించే అరుదైన జాతరగా కొమ్మాల జాతర ప్రత్యేక గుర్తింపు పొందింది. హోళీ రోజున ఆలయ గుట్ట చుట్టూ బండ్లు తిరుగుట సందర్భంగా ప్రభల సందడి తారాస్థాయికి చేరుతుంది. రాజకీయ పార్టీలు, యువజన సంఘాలు, గ్రామస్తులు భారీ ప్రభ బండ్లను నిర్మించి స్వామివారిపై భక్తిని, తమ ప్రాబల్యాన్ని చాటుకుంటారు. రంగురంగుల విద్యుత్ దీపాలు, శిల్పకళా రూప కల్పనలతో అలంకరించిన ప్రభలు భక్తులను ఆకట్టుకుంటాయి. ఆంధ్రప్ర దేశ్లోని కోటప్పకొండ జాతరలో ప్రభలు కనిపించినా, తెలంగాణలో మాత్రం కొమ్మాల జాతర ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది.
బ్రహ్మోత్సవాల వైభవం
ఈ నెల 23 నుంచి మార్చి 9వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిం చనున్నట్లు ఆలయ ఈవో ప్రసాద్, ట్రస్టీ చైర్మన్ చక్రవర్తుల శ్రీనివాసాచార్యులు తెలిపారు. 23న అధ్యయనోత్సవంతో ప్రారంభమై 24న ప్రబంధసేవ, 25న నిత్యవిది, పరమపదోత్సవం, 26న అంకురారోపణం, అగ్ని ప్రతిష్ఠ, ధ్వజారో హణం నిర్వహిస్తారు. 27న రాత్రి 10 గంటలకు స్వామివారి కళ్యాణోత్సవం వైభవంగా జరగనుంది. 28న హనుమత్సేవ, వాహనసేవలు, మార్చి 1న నిత్యహోమం, సింహవాహనసేవ, 2న గరుడవాహనసేవ, పర్వతబలి నిర్వహి స్తారు. మార్చి 3న శకటయానోత్సవం, బండ్లు తిరుగుట ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. 7వ తేదీన రథోత్సవం, 8న పారువేట, పుష్పయాగం, నాగవెల్లి, 9న శతఘటాభిషేకంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. భారీగా భక్తులు తరలి వచ్చే అవకాశంతో అధికారులు తాగునీరు, విద్యుత్, పారిశుధ్యం, భద్రతపై ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ నియంత్రణ చర్యలు అమలు చేస్తున్నారు. ప్రభల వెలుగుల్లో, భక్తుల భక్తితో కొమ్మాల నరసింహస్వామి జాతర వైభవంగా కొనసాగనుంది.
Post a Comment